Saturday, October 21, 2017

ఉత్తమ వాన కధలు , నా భావాలు

ఉత్తమ వాన కధలు , నా భావాలు
వాన కధల కి ఓ సంకలనం ఏంటి? పైగా దీనికితోడు ఉత్తమ తెలుగు అనే విశేషణం? అనే కుతుహులం ఎక్కువైంది.
ఇంతలో పుస్తకావిష్కరణ కి పిలుపు కూడా వచ్చింది.
నేస్తం సుందరీ నాగమణి(రచయిత్రి), పెద్దమ్మాయి స్వప్న కలిసి వెళ్ళాము.
అక్కడికి చేరుకునే లోపల “వాన కు తడిసిన మట్టి సుగంధంలాంటి జ్ఞాపకాలు తెరలుతెరలుగా గుప్పున వచ్చి మనసుని చుట్టేసాయి.
“చిన్నతనం లో అమ్మమ్మ ఊరి కి వెళ్ళినప్పుడు వచ్చిన వాన చిన్న నాటి జ్ఞాపకాల పరిమళాల ని గుర్తు తెస్తే , డిగ్రీ చదివేటప్పుడు, శాంతినికేతనం లాంటిది మా కాలేజీ అని పైకి అంటూ అబ్బే వట్టి పూరి పాకలు అని లోపల తిట్టుకుంటూ, బెంచిల మీదికి గొంగళిపురుగు లు వస్తున్నాయి అని విసుక్కున్నా, చెట్ల మధ్య నుంచి కురుస్తున్న వానను చూసి ఆనంద పడే బరువు,భాద్యతల లేని అల్లరి వయసు జ్ఞాపకాలు కొన్నయితే, దివిసీమ ఉప్పెనకు ,గాలివానలో నాన్నగారు రైలు పెట్టెలో చిక్కడిపొతే ,ఆ భయంకరమైన కాళరాత్రి జ్ఞాపకం ఇప్పటికీ వణుకు తెప్పించేది గా ఉంటుంది..
సంసారబంధం ఏర్పడిన తరువాత ఇద్దరి పిల్లలలు శ్రీవారి తో స్కూటర్ మీద హైకోర్ట్ నుంచి మదీనా వైపు వస్తుండగా కురిసిన భారీ కుండపోత వానకి, దారి కనపడక నాలా అంచు దగ్గర ఆగిపోయినప్పుడు ఆ నాటి వానలో కొట్టుకు పోయి ఉంటె అనే ప్రశ్న, జీవితం లో మర్చిపోలేని జ్ఞాపకం.”
ఇలా దారంతా అవి ప్రవహిస్తూనే ఉన్నాయి.
వాన కధల పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అందులో కధల గురించి ప్రస్తావన చేస్తునప్పుడు. మొదటి కధ పాల గుమ్మి పద్మ రాజు గారి “ గాలి వాన” ఆ మాట వినగానే చటుక్కున నాన్నగారు మెదిలారు ఎందుకంటె ఆ కధ వెనుక కధను గురించి నాన్నగారు ఓ అపురూపమైన జ్ఞాపకం చెప్పారు. నాన్నగారు - ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. పెద్ద నాన్నగారు పాలగుమ్మి పద్మరాజు గారు ఇరువురు కూడా భీమవరం కాలేజి లో సహద్యాయులు. పక్క పక్క ఇళ్ళలోనే వుండే వారు. బహుశా ఈ సంఘటన బహుశా 1949-50 ల -మధ్య జరిగింది అనుకుంటా. అప్పుడు వచ్చిన అతి పెద్ద గాలివానలో వారు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వారి శ్రీమతి గారికి దెబ్బతగలటం తో ఒక ఏడాది పాటు ఆవిడ కోలుకోలేకపోయారు. ఆ గాలివాన ఉదృతం చూసిన ఆయన తనకు కలిగిన ఆ భయంకరమైన అనుభవం నుంచే అక్షరరూపం ఇచ్చారని చెప్పేవారు.
ఈ సంకలనం లో ఇరవయి కధలు మొత్తం . మొదటి కధ తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనమైన కద తో మొదలయి. ఓ సాయంత్రపు అదృష్టం అనే కధ తో ముగుస్తుంది. చివరి కధను సంకలన కర్త అయిన ఖదీర్ బాబు వ్రాసారు. ఓ వర్షం కురిసిన సాయంత్రం నుంచి మరునాడు ఉదయం వరకు జరిగిన జీవితం గురించి అతను అని చెప్పబడే పాత్రధారి యొక్క మనస్థితి ని దృశ్యంగా చూపించారు.
ముందు తరం రాసిన కధల తో పాటు ఈ తరం కధలు కూడా చదువరలను తమ రచ(వా)నా చాతుర్యపు జల్లులలో ముంచెత్తుతారు
నాకెంతో ఇష్టమయిన తిలక్ కధ ‘ఊరి చివరి ఇల్లు, అదో అపూర్వ అనుభవం”
వల వలా కురుస్తోంది, జలజలా కురుస్తోంది వాన, కృష్ణ అంతా చినుకులు ,పులకరింతలు అంటూ తలమునకలుగా తడిపిన ‘రెండు గంగలు’ కధ ఎన్ని సార్లు చదివినా తనివితీరదు . bs రాములు గారి పాలు కధ పెత్తందారి తనం చూపించేదిగా ఉంది , కళ్ళలోంచి వాన కురిపిస్తుంది,
పేగుకాలిన వాసన మరో అద్భుతమైన కధ, శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ ,కొత్త గా ఉంది , అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో రావిశాస్త్రి 'వర్షం', మహేంద్ర రాసిన 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లో ని మనుషులు మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటుంది .సం వే రమేశ్ గారి ‘ఉత్తరపొద్దు’ కధ ఆసక్తి కరంగా ఉంది.
పూడూరి రాజిరెడ్డి కధ ‘నగరం లో వాన’ వచనకవిత్వం లా సాగిపోతుంది. అడవి నేపధ్యం లో సాగిన ‘మృగశిర ‘ కధ, కుప్పిలిపద్మ కధ ‘గోడ’ లో ఒక లాలిత్యం కనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని కధలు మనసుకి హత్తుకునేలా ఉంటె మరికొన్ని తమ వెంట తీసుకొని వెళతాయి.
సంపాదకుడు ఖదీర్ చెప్పినట్లు కళకళ , జలజల మనే ఈ ఉత్తమ తెలుగు వానకధల లోకి గొడుగు తొడుగు లేకుండా వెళ్లి తడిసి ముద్దయి, మళ్ళి మళ్ళి తడవాలని అదేనండి మరో వానకధల సంకలనం కోసం ఎదురు చూస్తూ...
మణి వడ్లమాని